స్వాతంత్ర్య పోరుకు ‘ సాహితీ ‘ బాట వేసిన కవులు – ఆచార్య ఎం . రామనాథం నాయుడు
మైసూరు, మే 20 (నందిధాత్రిక): భారతదేశ స్వాతంత్ర్యం కోసం జరిగిన పోరుకు ప్రముఖ కవులెందరో సాహితీ బాట వేశారని కర్ణాటక రాష్ట్ర సార్వత్రిక విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య శరణప్ప .వి. హలసె అన్నారు. శనివారం ఆ యూనివర్సిటీ ప్రాంగణంలో తెలుగు అధ్యయన, పరిశోధన విభాగం శాఖాధ్యక్షులు ఆచార్య ఎం. రామనాథం నాయుడు, ఐ.సీ.ఎస్. ఎస్. ఆర్ సంయుక్త ఆధ్వర్యంలో స్వాతంత్రోద్యమంలో తెలుగు, కన్నడ కవుల పాత్ర అనే అంశంపై రెండు రోజుల జాతీయ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంగ్లేయుల నుంచి దేశ స్వాతంత్ర్యం కోసం దశాబ్దాల తరబడి ఉద్యమాలు జరిగాయన్నారు. ఇందులో ప్రముఖ కవులు, రచయితలు ఎన్నో కావ్యాలు, గేయాలు, నాటికలు రచించి, బ్రిటీషు పాలనలో జరుగుతున్న అన్యాయాలు, స్వాతంత్య్ర ఆవశ్యకత, ఉద్యమ తీరు తదితర అంశాలను సామాన్యులకు సైతం అర్థమయ్యేలా వివరించినట్లు చెప్పారు. తెలుగు, కన్నడ భాషల సోదరత్వాన్ని , ద్రావిడ భాషల ఔనత్యాన్ని చాటి చెప్పారు. అనంతరం ఆచార్య రామనాథం నాయుడు మాట్లాడుతూ తెలుగులో చిలకమర్తి లక్ష్మీ నరసింహం నుంచి రాయప్రోలు సుబ్బారావు, కాశీనాధుని నాగేశ్వరరావు, బసవరాజు అప్పారావు వరకు ఎంతో మంది కవులు అందించిన సాహితీ సేవలు ఎనలేనివన్నారు. కన్నడ కవుల్లోనూ స్వాంతత్ర్య పోరుకు కృషి చేసిన వారు ఎంతో మంది ఉన్నారని, వారి సేవలను ఈ సందర్భంగా గుర్తు చేశారు. తెలుగు, కన్నడ కవులకు పేరు పేరున స్మరించుకున్నారు. స్వాంతంత్య్ర ఫలాలు అనుభవిస్తున్న నేటి తరం వారు నాటి పోరాట యోధులతో పాటు ఉద్యమానికి సాహితీ మార్గంలో సేవలందించిన కవుల సేవలను గుర్తించుకోవాలని సూచించారు. అనంతరం కన్నడ అధ్యాయన కేంద్రం డైరెక్టర్ ప్రొఫెసర్ ఎన్ఎం తళవార్ మాట్లాడుతూ కరీం ఖాన్, జెట్టిగేరి కృష్ణ శర్మ , బెంద్రే , తిరుమల రాజమ్మ లాంటి కన్నడ కవులెందరో సేవలందిచినట్లు వెల్లడించారు. రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కేఎన్ఎల్ మూర్తి మాట్లాడుతూ 1857 సిపాయిల తిరుగుబాటులో ధర్మ పోరాటంగానే గుర్తించాలని, ఆ సమయంలో సాహితీవేత్తల సేవలు మరువలేనివన్నారు. ఆచార్య రామనాథం నాయుడు ఇలాంటి సదస్సులు నిర్వహించి, నాటి త్యాగధనులను స్మరించుకునేలా చేశారని, ఆయన సేవలను గుర్తించి వీసీతో పాటు వక్తలందరూ సన్మానించారు. ఈ సదస్సులో తెలుగు, కన్నడ సాహితీవేత్తలు, భాషాభిమానులు, పరిశోధకులు, విద్యార్థులు, అధ్యాపకులు, పాల్గొని పరిశోధక పత్రాలు సమర్పించి, అమూల్యమైన సందేశాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డీన్ ఆచార్య లక్ష్మీ , డాక్టర్ మన్యం నర్సింహులు, డాక్టర్ బి. చక్రవర్తి , డాక్టర్ బి. నాగశేషు ఆచార్య ప్రవీణ్, డాక్టర్ ఖాదర్ పాషా, డాక్టర్ పోసుపాటి శంకర్రావు పాల్గొన్నారు.